● బాదంపాలు తాగి పలువురికి అస్వస్థత
● హటకేశ్వర, కొండమ్మతల్లి జాతరలో ఘటన
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన వారు జాతరలో బాదం పాలు తాగి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. గురువారం హటకేశ్వరస్వామి, కొండమ్మ తల్లి యాత్ర ముగింపు జరిగింది. ఈ సందర్భంగా సింగుపురం సచివాలయం కేంద్రం వద్ద రాజస్థాన్కు చెందిన ఓ ట్రావెల్ బడ్డీ ద్వారా అమ్మిన బాదంపాలు, ఐస్క్రీమ్లను చాలా మంది ఆస్వాదించారు. రూ.40 విలువ గల బాదంపాలు సాయంత్రానికి రూ.10కే ఇవ్వడంతో మరింత మంది ఆ పాల కోసం క్యూ కట్టారు. శుక్రవారం ఉదయం నుంచి వీరిలో చాలా మందికి వాంతు లు, విరేచనాలు, జ్వరం రావడంతో వారంతా దగ్గరిలో గల ప్రైవేట్ క్లినిక్లకు పరుగులు పెట్టారు. బాదం పాలు తాగడం వల్లే వాంతులయ్యాయని వారంతా వైద్యుల వద్ద చెప్పడం గమనార్హం. సింగుపురం గ్రామంలోని పలు ప్రైవేటు క్లినిక్లలో సుమా రు 60 నుంచి 70 వరకూ మందులు తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సింగుపురం ప్రాధమిక వైద్యాధికారి వద్ద వెంకట్ వద్ద ప్రస్తావించగా బాదంపాలు తాగడంతో సింగుపురం చుట్టుపక్కల గ్రామాల్లో పలువురు అస్వస్థతకు గురైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో అన్ని రకాల మందులు ఉన్నాయని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న దృశ్యం
ఆస్పత్రి వద్ద జనాలు


