ఎగిరెగిరి పడకు..
● జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా ఎగురుతున్న డ్రోన్లు
● వెడ్డింగ్ ఫొటోగ్రఫీకి సైతం అనుమతి తీసుకోవాలంటున్న పోలీసులు
● కేసులు తప్పవంటూ హెచ్చరికలు
శ్రీకాకుళం క్రైమ్ :
వివాహాలు, వేడుకలు, జాతరలు, సమ్మేళనాలు.. కార్యక్రమం ఏదైనా డ్రోన్ తెగ ఎగురుతోంది. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ నుంచి దేవుడి ఉత్సవాల వరకు అన్ని కార్యాలకూ డ్రోన్లను మితిమీరి వినియోగిస్తున్నారు. ఈ వైఖరి పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఫొటోగ్రఫీ, సోషల్ మీడియా పేరిట వందల సంఖ్యలో డ్రోన్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడంతో సంఘ విద్రోహ శక్తులు పేట్రేగే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నేళ్ల కిందట సంతబొమ్మాళి మండలం భావనపాడు సమీప మూలపేట తీరంలో మత్స్యకారుల వలకు విదేశీ డ్రోన్జెట్ చిక్కడం అప్పట్లో కలకలం రేపింది. జిల్లాలో ఎగురుతున్న డ్రోన్లను ఎవరు దేనికి ఉపయోగిస్తున్నారో స్పష్టత ఉండడం లేదు. వివాహాలు, ఈవెంట్లు, వీడియో షూటింగ్ కోసం కొన్ని సంస్థలు డ్రోన్లను అద్దెకు ఇస్తున్నాయి. దీంతో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వీటిని ఇబ్బడి ముబ్బడిగా వాడుతున్నారు. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లాలో రథసప్తమి, కొత్తమ్మతల్లి, మరికొన్ని ప్రభుత్వం జరిపిన వేడుకల్లో పోలీసుల డ్రోన్లతో పాటు ప్రైవేటు వ్యక్తుల డ్రోన్లు సైతం గగనతలాన విహరించాయి. కానీ వీటిని ఉపయోగించడానికి కూడా నిబంధనలు పాటించి తీరాలి.
భావనపాడు మూలపేటలో మత్స్యకారుల
కంటపడిన విదేశీ డ్రోన్ జెట్ (ఫైల్)
అనుమతులు ఉండాల్సిందే..
శ్రీకాకుళం నగరంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద మాట్లాడుతూ.. ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా, ప్రత్యేక ఈవెంట్ అయినా పోలీసుల అనుమతి తీసుకోకుండా డ్రోన్లను ఎగురవేస్తే కఠిన చర్యలుంటాయని, కేసులు కడతామని, అవసరమైతే ఆ డ్రోన్లను స్వాఽధీనం చేసుకుంటామని చెప్పారు. నగరంలో అయితే 3 ప్రైవేటు డ్రోన్లను చూశామన్నారు. తీర ప్రాంతాల్లో బీచ్లకు వెళ్లే సందర్శకులు డ్రోన్లు వాడినా పోలీసులకు చెప్పాల్సిందేనన్నారు.
ఎగిరెగిరి పడకు..


