ప్రభుత్వ స్థలాల ఆక్రమణ!
● ఇచ్ఛాపురంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు ● పట్టించుకోని అధికారులు
ఇచ్ఛాపురం:
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా ఆక్రమణదారులు ఏదో ఒక విధంగా సొంతం చేసుకుంటున్నారు. స్థానిక నాయకుల ఆండదండలతో కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. రత్తకన్న రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మంగలకాలనీ వద్ద 197 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీకి కేటాయించారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కాలనీ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. స్థలాన్ని చదును చేసి నాలుగు వైపులా స్థంభాలు పాతి కంచె వేశారు. పాతాళ సిద్ధేశ్వరాలయం సమీపంలో ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది పశువులను కట్టి మేపుతున్నారు. కొంతకాలం చేసిన తర్వాత ఆ స్థలం తమదే అంటూ నకిలీపత్రాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. సంతపేట పంపు హౌస్ వద్ద పాతాళ సిద్ధేశ్వరాలయానికి వెళ్లే దారిలో చిన్నపాటి చెరువులాంటి ప్రాంతం, దాని సమీపంలో స్థలంపై ఆక్రమణదారుల కన్నుపడింది. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అధికారులు సైతం అడ్డుపడకపోవడంతో ఇదే అదునుగా చెరువును సైతం ఆక్రమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెరువులో మట్టివేసి కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు. ఆక్రమణలు జరిగినట్లు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు చేపడతాం. ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదు.
– ఎన్.వెంకటేశ్వరరావు,
తహసీల్దార్, ఇచ్ఛాపురం
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ!
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ!


