
ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు
మెళియాపుట్టి: మండలంలోని గంగరాజపురం గ్రామానికి చెందిన యువకుడు గూడపు చంటి(29) విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని మున్నాజెన్నా అనే వ్యక్తి ఇంటిపై చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ఉండడంతో ఒడిశాలోని జంగాలపాడు గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు మృతుడు చంటిని ఆ కొమ్మలు తొలగించడానికి సాయంగా రమ్మన్నాడు. దీంతో విద్యుత్ సరఫరా ఉండగానే చెట్టు కొమ్మలను చంటి తొలగిస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క దమయంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు కొద్దికాలం క్రితమే మృతి చెందారు. అతడు విజయవాడలోని ఒక ప్రైవేట్ కంపెనీలో వెల్డింగ్ కార్మికునిగా పనిచేసేవాడు. ఇటీవల వినాయక చవితికి గ్రామానికి వచ్చాడు. మంగళవారం విజయవాడ బయల్దేరి వెళ్లడానికి సిద్ధమవ్వగా.. ఇంతలో ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కంచిలి: మండలంలోని గొల్ల కంచిలి నుంచి కంచిలి వెళ్లేమార్గంలో మఠం చెరువు సమీపంలో రైల్వేట్రాక్పై సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని పలాస జీఆర్పీ పోలీసులు సోమవారం గుర్తించారు. ప్రమాదంలో మృతుని ముఖం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. మృతుడి శరీరంపై ఆరెంజ్, తెలుపు రంగు కలిగిన గడుల తువ్వాలు మాత్రమే ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు 94406 27567, 99891 36143 నంబర్లను సంప్రదించాలని కోరారు.
తప్పిన పెను ప్రమాదం
జి.సిగడాం: మండలంలోని మర్రివలస పంచాయతీ మానంపేట గ్రామంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ తీగ తెగిపడిన సమయంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన బాడిత కనకలక్ష్మికి చెందిన ఆవుకు విద్యుత్ తీగ తగలడంతో మృత్యువాత పడింది. ఇదే సమయంలో కనక లక్ష్మికి సైతం విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురయింది. వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై కర్రలతో విద్యుత్ తీగను తొలగించారు. అనంతరం ఆమెను హుటాహూటిన రాజాం అస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ మానంపేట మీదుగా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వ్యవసాయ కోసం ఏర్పాటు చేసిన లైన్లు మార్చాలని కోరుతున్నారు.
ద్విచక్ర వాహనం దొంగకు జైలు శిక్ష
నరసన్నపేట: ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో సారవకోట మండలం బుడితికి చెందిన కొర్ల శివకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.500ల జరిమానాను నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వాణి విధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎచ్చెర్ల మండలం యాతపేటకు చెందిన సోడి పైడిరాజు ద్విచక్ర వాహనం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్క్ చేయగా చోరీకి గురైంది. ఈ మేరకు ఈ ఏడాది మే 30న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కొర్ల శివను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జిషీట్ పోలీసులు వేయగా, నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి విచారణ చేపట్టారు. సోమవారం కొర్ల శివను దొంగగా నిర్ధారించి జైలుశిక్ష ఖరారు చేశారు. కేసులో ఏపీపీగా శాంతి సంతోషి వ్యవహరించారు. ఈ మేరకు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
పలాస: మందస మండలం మఖరజోల గ్రామ పంచాయతీ పరిధి అల్లిమెరక కాలనీలో నివాసముంటున్న కొండ కురమ్మ (22) సోమవారం పలాస మండలం రంగోయి గేటు సమీపంలోని ఒక జీడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కురమ్మ తల్లి గాది పద్మ, కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కురమ్మ భర్త చంద్రశేఖర్ కత్తర్కు వలస కూలీగా గతేడాది వెళ్లాడు. కురమ్మకు కడుపులో నొప్పి ఉంది. ఇటీవల సోంపేట మండలం జురాబంద గ్రామంలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లింది. కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో సోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. కన్నవారి ఇంటి నుంచి వచ్చిన కురమ్మ ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు