
ఎస్పీ గ్రీవెన్సుకు 48 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం పరిష్కార వేదిక (ఎస్పీ గ్రీవెన్సు)కు బాధితుల నుంచి 48 వినతులు అందాయి. అదనపు ఎస్పీ కేవీ రమణ వినతులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
రమ్మీ చేసిన చేటు
ఆన్లైన్ రమ్మీ గేమ్ ఇద్దరి మధ్య వివాదానికి తెరలేపింది. ఐదురోజుల క్రితం ఒకరు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరొకరు ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. ఎస్పీ గ్రీవెన్స్లో బాధితుడు రబీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కాశీబుగ్గ సమీపంలోని రాజగోపాలపురం గ్రామంలో పంచముఖి గ్రానైట్ ఎగ్జిమ్ కంపెనీలో విజయనగరం జిల్లా తర్లాం మండలం కుసుమూరుకు చెందిన బీడిక రబీంద్ర సంవత్సరకాలంగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. పలాసలోనే భార్య, పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అదే కంపెనీలో ఒడిశాకు చెందిన చంద్రమణి అడ్జువాడ్ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగైదు నెలలుగా ఆన్లైన్లో రమ్మీ గేమ్ ఆడుతున్నారు. మొదట్లో రమ్మీలో డబ్బులు ఎక్కువగా గెలవడంతో చంద్రమణికి దాదాపు రూ.1 లక్ష వరకు తాను ఇచ్చానని ఫిర్యాదులో రబీంద్ర పేర్కొన్నాడు. అనంతరం చంద్రమణి తన ఫోన్కు వేర్వేరు సందర్భాల్లో డబ్బులు పంపి అతనే రమ్మీ ఆడేవాడని, ఈక్రమంలో అధికంగా డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిపారు. ఈవిధంగా దాదాపు తనకు రూ.1.67 లక్షలు ఫోన్పే ద్వారా పంపించాడని, అవన్నీ అతడే రమ్మీ ఆడి పోగొట్టుకున్నాడని పేర్కొన్నారు. కానీ తానే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1,73,500లు అతడి నుంచి కాజేసినట్లు కాశీబుగ్గ పోలీసులకు చంద్రమణి ఫిర్యాదు చేశాడని వాపోయాడు.
మొబైల్ను దాచేసి.. క్వారీలో దాడి చేసి
కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసిన చంద్రమణి, అతడి మద్దతుదారులు సెల్వరాజ్, మరో వ్యక్తి తనపై దాడికి పాల్పడ్డారని రబీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సెల్ఫోన్ లాగేసుకుని అందులో ఆధారాలన్నీ డిలీట్ చేసి పోలీసులకు అప్పజెప్పారన్నారు. స్టేషన్లో తనను మూడురోజులుంచారని, అనంతరం ఈనెల 3వ తేదీ రాత్రి పోలీసులు వదిలేయడంతో ఇంటికి వెళ్తుండగా బొలేరో వాహనంలో చంద్రమణి మద్దతుదారులొచ్చి బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నించగా తప్పించుకు పారిపోయానని పేర్కొన్నాడు. సోమవారం సైతం ఇదే విషయంపై కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వస్తుండగా, పలాస ఆర్టీసీ కాంప్లెక్సు సమీప ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద చంద్రమణి, మరో ఇద్దరు కాపుకాశారన్నారు. దీంతో తనపై దాడి చేసి చంపేస్తారేమోనన్న భయంతో నేరుగా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.