
టీచర్లకు బదిలీ కష్టాలు
● వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు
● కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు
శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయ సాధారణ బదిలీలు గందరగోళంగా మారాయి. ఆదరాబాదరాగా నిర్వహిస్తున్న బదిలీల ప్రక్రియతో టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు మొదలుకొని సాఫ్ట్వేర్ మొరాయింపు, ధ్రువపత్రాల అప్లోడింగ్ కష్టాలు, స్టేషన్ పాయింట్ల కేటాయింపులో తేడాలు, 5/8 సంవత్సరాలకు మెరిట్ పాయింట్ల కేటాయింపు సరిగాలేకపోవడం, ఎంపికచేసుకునే పాఠశాలలు కనిపించకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే విషయమై పలువురు ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 83 గ్రేడ్–2 హెడ్మాస్టార్ల పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు/తత్సమాన ఉపాధ్యాయులతో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.