టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఎమర్జింగ్ మెటిరీయల్స్ ఫర్ టెక్నాలజికల్ అప్లికేషన్స్ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం కళాశాలకు చెందిన ఎంబీఏ అధ్యాపకులు కె.వేణుగోపాల్, డి.విష్ణుమూర్తి తదితరులు రాసిన మార్కెటింగ్ స్మాల్ బిజినెస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎ.ఎస్.సంతోష్కుమార్, బి.వి.రమణ, డి.శ్రీరాములు, ఎం.వి.రత్నమణి, ఎం.రమణయ్య, బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్తాచాటిన విద్యార్థినులు
గార: జాతీయ టార్గెట్ బాల్ జూనియర్ క్రీడా విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జట్టు పాల్గొని గోల్డ్ మెడల్ సాధించగా, ఈ జట్టులో గార మండలం శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులు ఆరుగురు ఉన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆగ్రాలోని విద్యా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టు పాల్గొంది. ఈ జట్టులో శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులు పడపాన మాధవి (పదో తరగతి), బచ్చు కీర్తి (పదో తరగతి), నీలాపు సుస్మిత (పదో తరగతి), పరపతి లావణ్య (పదో తరగతి), కోనారి రజిని (పదో తరగతి), చుక్క గాయత్రి (ఇంటర్)లు పాల్గొన్నారు. పీడీ జె.నాగరత్నం శిక్షణలో వీరంతా క్రీడలో పాల్గొని విజయం సాధించడంపై ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారి అభినందించారు.
గార గ్రామంలో విషజ్వరాలు
గార: మండల కేంద్రం గార గ్రామంలో విష జ్వరాలతో పలువురు బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజలు జ్వరాలతో ఉన్నా ప్రభుత్వ వైద్య సిబ్బంది కనీసం రోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ప్రైవేటుగా వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక సిబ్బందికి చెబుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో తాగునీటిని పరీక్ష చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రకళను కలిసి తెలియజేశామని, ఇంతవరకు పరీక్షలు కూడా జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీటి నమూనాలు సేకరించి విశ్లేషణ చేయాలని, రోగాల బారినపడిన ప్రజలకు వైద్యమందించేందుకు తక్షణమే మెడికల్ క్యాంపులు పెట్టాలని కోరుతున్నారు.

పోస్టర్ ఆవిష్కరణ