ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు శ్రీనివాసులు (35) శనివారం రాత్రి కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసుల వివరాల మేరకు... శ్రీనివాసులు కూలి మగ్గం నేసుకుంటూ జీవించేవాడు. ఆరేళ్ల క్రితం మహేశ్వరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఆమె మృతి చెందింది. భార్య చనిపోవడంతో శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. మరో పెళ్లి చేస్తే మద్యం మాని బాగుడతాడని తల్లిదండ్రులు భావించారు. ముదిగుబ్బ మండలం సిరిగారిపల్లికి చెందిన నందు అనే అమ్మాయితో మరో పెళ్లి చేశారు. అయితే రెండో పెళ్లి తరువాత కూడా శ్రీనివాసులు మద్యం తాగి తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాలుగు నెలల కిత్రం పుట్టింటికి వెళ్లింది. కొద్ది రోజులుగా మృతుడు తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తమ్ముడు ఆదివారం శ్రీనివాసులును నిద్ర లేపడానికి తలుపు తట్టగా ఇంట్లో ఉరివేసుకున్న దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి ఆదెప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


