రొళ్ల: చింత చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం హులికుంట గ్రామానికి చెందిన రంగశామప్ప (58)కు భార్య కామాక్షమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో తన పొలంలో పెంచిన చింత చెట్లలోని కాయలు కోసేందుకు శుక్రవారం తన భార్యతో కలసి వెళ్లిన రంగశామప్ప అక్కడ చెట్టు పైకి ఎక్కాడు. కాయలు కోస్తూ అదుపు తప్పి కింద పడ్డాడు. ఛాతీ, వెన్నెముకపై బలమైన దెబ్బలు తగలడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. కామాక్షమ్మ నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని ప్రైవేట్ వాహనంలో రొళ్లలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంగశామప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు.
కత్తులతో పరస్పర దాడి
హిందూపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాలు కత్తులు దూసుకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురంలోని మేళాపురంలో నివాసముంటున్న హరీష్రెడ్డి చెల్లెల్ని విశ్వనాథరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో హరీష్రెడ్డి, విశ్వనాథరెడ్డి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు చెలరేగాయి. అప్పటి నుంచి తరచూ మాటాలతో గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆవేశంతో ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. హరీష్రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


