●ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన
రొద్దం: ఇసుక అక్రమ రవాణాపై రైతులు కన్నెర్ర చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. మరోసారి పెన్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే సహించబోమని హెచ్చరించారు. మండల పరిధిలోని కందుకూర్లపల్లి పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి కొందరు అనుమతులు లేకుండా ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇసుక తరలిస్తున్న వారు రైతులతో వాగ్వాదానికి దిగారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని తీరుతామంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...ఇసుక అక్రమ రవాణాతో పెన్నా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలమట్టం పడిపోతోందని, దీంతో నదిలో వేసుకున్న ఫిల్టర్ బోర్లు బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వ్యవసాయమే జీవనాధారమని, సాగునీరు లేకపోతే కుటుంబాలు వీధిన పడతాయన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. లేకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.
పది పరీక్షల్లో 219 మంది గైర్హాజరు
పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 219 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు. 107 పరీక్షా కేంద్రాల్లో 21,492 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,273 మంది హాజరయ్యారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 113 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ వెల్లడించారు. 6,520 మందికి గాను 6,407 మంది హాజరయ్యారు.


