ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్డీఓగా ప్రేమంత్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కడపలో సర్వశిక్ష అభియాన్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్మవరంలో ఇన్చార్జ్ ఆర్డీఓగా రామసుబ్బయ్య విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో నూతన ఆర్డీఓగా ప్రేమంత్కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
సీ.కొడిగేపల్లిలో చిరుత సంచారం
మడకశిరరూరల్: మండల పరిధిలోని సి.కొడిగేపల్లి గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని పొదల్లో ఉన్న చిరుత తనకు సంబంధించిన గొర్రెల మందపై దాడి చేసి పొట్టేలును చంపేసిందని గొర్రెల కాపరి దాళప్ప తెలిపారు. దాదాపు రూ.20 వేలు నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. వారం రోజుల నుంచి గ్రామ సమీపంలోని పొదల్లో చిరుత సంచరిస్తున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత భయంతో పొలాల వద్దకు వెళ్లలేక పోతున్నామన్నారు. అటవీశాఖాదికారులు చర్యలు తీసుకుని చిరుత సంచారం లేకుండా చూడాలన్నారు. చిరుత దాడిలో మృతి చెందిన గొర్రెల కాపరికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
పోక్సో కేసు నమోదు
ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలంలోని ఓ మారుమూల గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలికను నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తిపై పట్నం పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
భూగర్భ జలాలపై పరిశోధన
● కలెక్టర్కు నివేదిక సమర్పించిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు
ప్రశాంతినిలయం: హిందూపురం నియోజకవర్గంలో భూగర్భ జలాలపై పరిశోధనలు జరిపిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అధికారులు కలెక్టర్ శ్యాంప్రసాద్కు నివేదికలు అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హిందూపురం, లేపాక్షి మండలాల్లో భూగర్భ జలాలపై పరిశోధన చేయగా తక్కువ జలాలు ఉన్నట్లు , భూగర్భ జలాల పెంపునకు పలు సూచనలు చేసినట్లు సభ్యులు వివరించారు. ఇందులో చోళసముద్రాన్ని మోడల్గా తీసుకొని పరిశోధన చేశామన్నారు. పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పండిత్ మగ్నూర్, మాధవ్రేష్మాపిళ్లై, స్వరూప్ కళ్యాణ్ సాహూ, ప్రతీక్, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి రాజశేఖర్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ గురుమూర్తి, డీఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొకై ్లనర్, ఇసుక ట్రాకర్ల సీజ్
పుట్టపర్తి అర్బన్: స్థానిక చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తోడుతున్న ప్రొకై ్లనర్తో పాటు ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. రాత్రి సమయాల్లో చిత్రావతి నది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నట్లుగా సమాచారం అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ప్రొకై ్లనర్, రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. వీటిని పుట్టపర్తి రూరల్ పీఎస్కు తరలించారు. తనిఖీల్లో గనుల శాఖ ఏడీ అమీర్బాషా, రాయల్టీ ఇన్స్పెక్టర్ షేక్ ఖాజావలి, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి, ఏఈ సుధాకర్ పాల్గొన్నారు.


