పుట్టపర్తి: ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్టీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో అధికారులకు వినతిపత్రాల సమర్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ను నాయకులు కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పీఆర్సీ ప్రకటించకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, నాలుగు డీఏలను పెండింగ్లో ఉంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని నిరసించారు. ఆర్థిక సమస్యలతో పాటు యాప్స్ పేరుతో ఉపాధ్యాయులపై అదనపు భారం మోపుతూ బోధనకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లీలా ఇంద్ర ప్రసాదరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, నాయకులు భాస్కర్రెడ్డి, ప్రతాపరెడ్డి, శివయ్య, శ్రీనివాసరెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, మనోహర్రెడ్డి, సునీత, అనిత, ఇందిర, సురేష్, మహమ్మద్ అలీ, జమీర్, ప్రభాకర్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


