పుట్టపర్తి: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉర్దూ పరీక్షకు ఒకరు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మొత్తం మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 46 మంది విద్యార్థులకు గాను 45 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉర్దూ విద్యార్థులకు మోడ్రన్ లాంగ్వేజ్ పీరక్ష, జనరల్ బైపీసీ విధ్యార్థులకు బ్రిడ్జి కోర్సు (గణితం) పరీక్షలు జరిగాయి.
గర్భం దాల్చిన విద్యార్థిని!
ముదిగుబ్బ: బత్తలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఓ బాలిక గర్భం దాల్చిన అంశం కలకలం రేపింది. ముదిగుబ్బ మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని గర్భం దాల్చినట్లుగా తెలియగానే అధికారులు అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సమీప బంధువే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశంపై సీడీపీఓ సరస్వతిని ఫోన్లో సంప్రదించగా తనకు ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొన్నారు.
ఖాద్రీశుడి హుండీల లెక్కింపు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను ఆలయంలో సోమవారం లెక్కించారు. 35 రోజులకు గాను రూ.1,15,10,416 నగదు, 2 గ్రాముల బంగారు, 305 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హుండీల పర్వేక్షాణాధికారి వెంకటేశ్వరులు, ఏపీజీబీ మేనేజర్ బి.రామకృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.


