పుట్టపర్తి టౌన్: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలోనూ విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు నాటినాటికీ పెరిగి పోవడమే ఇందుకు నిదర్శనం. విద్యుత్ సిబ్బంది అలసత్వం, సేవల్లో జాప్యం, వినియోగదారుల అవగాహన లోపం, సొంత మరమ్మతులు తదితరాల వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. విద్యుత్ ప్రమాదాలు నియంత్రణ, నష్ట తీవ్రత తగ్గించేందుకు విద్యుత్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకూ చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదాల్లో 32 మంది అకాల మృత్యువాత పడ్డారు. ఈ నెలలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందారు. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారికి పరిహారం కూడా ఏళ్లతబడి పెండింగ్లో ఉంచుతున్నారు. విద్యుత్ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించకపోవడం, విద్యుత్ సరఫరా వ్యవస్థల వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మనుషులు చనిపోతుండగా, మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. ప్రమాద బాధితులకు పరిహారం అందజేతలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.
పిట్టల్లా రాలుతున్న రైతులుం
వైఎస్ జగన్ పాలనలో జిల్లాలో రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరా అయ్యింది. కొత్తగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా వ్యవస్థను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలోపేతం చేసింది. దీంతో లోఓల్టేజీ సమస్య తీరింది. వ్యవసాయానికి రాత్రిపూట కరెంట్ సరఫరా బాధ తప్పింది. దీంతో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను కరెంట్ కష్టాలు వెన్నాడసాగాయి. ఓ వైపు లో ఓల్టేజీ సమస్య, మరో వైపు ఎక్కడికక్కడ నిర్వహణ లోపం కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతున్న విద్యుత్ తీగలతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో వారు స్పందించకపోవడం గమనార్హం. ‘ఎల్సీ ఇచ్చేస్తున్నాం మీరే మరమ్మతు చేసుకోండి’ అంటూ ఉచిత సలహాలిస్తూ అన్నదాతల జీవితాలతో చెలగాటమాడారు. ఫలితంగా విద్యుత్ షాక్కు గురై రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.
పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలు
ఈ నెలలో నలుగురి మృతి
మరమ్మతులపై సకాలంలో స్పందించని విద్యుత్ సిబ్బంది
అవగాహన లోపంతో ప్రాణాలు కోల్పోతున్న వైనం
జాగ్రత్తలే శ్రీరామరక్ష
తడిచేతులు, నీటిలో నిలబడి విద్యుత్తు మోటార్లను, స్విచ్లను తాకరాదు.
వ్యవసాయ మోటారు, స్టార్టర్లకు ఎర్తింగ్ తప్పని సరి.
పంట పొలాల్లోకి జంతువులు రాకుండా ఫెన్సింగ్కు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా ఇవ్వకూడదు.
మోటారుకు సొంతంగా మరమ్మతులు చేయరాదు. విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోయినప్పుడు సొంతంగా సరిచేయరాదు. సంబంధిత ఉద్యోగులు, సిబ్బందితో మరమ్మతు చేయించాలి.
ఇళ్లలో, పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగల నాణ్యతను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. పాడైనట్లు గుర్తిస్తే వెంటనే మార్చేయాలి.
ఇళ్లకు దగ్గరగా తీగలు వెళుతున్న, ఇళ్లపై తెగిపడినా, ట్రాన్సఫార్మర్లు తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నా..అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.
ప్రమాదవశాత్తు షాక్కు గురైన వ్యక్తిని రక్షించే క్రమంలో చేతులతో తాకకుండా కర్రతో వ్యక్తి నుంచి తీగలను దూరం చేయాలి.
ఎక్కడైనా ప్రమాదకరంగా విద్యుత తీగలు, స్తంభాలు ఉన్నట్లయితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలి. 1912 టోల్ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలి. ఈ నెంబరుకు ఫిర్యాదు చేయడం వలన తక్షణ స్పందన కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


