గాండ్లపెంట: మండల పరిధిలోని రెక్కమాను గ్రామంలో ఓ బాలిక కాలిపై ఆర్టీసీ అద్దె బస్సు చక్రం ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు.. గ్రామానికి చెందిన హఫీఫా వైఎస్సార్ జిల్లా వేంపల్లిలోని మైనార్టీ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు తన అవ్వతో కలసి ఆదివారం ఉదయం రాయచోటి ఆర్టీసీ డిపో అద్దె బస్సు ఎక్కింది. ఫుట్బోర్డు వద్ద నిలిచి ఉన్న బాలిక... బస్సు కదలడంతో అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వెనుక చక్రం బాలిక కాలిపై వెళ్లింది. దీంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే ఆమెను 108 వాహనం ద్వారా కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి, సమమ పాలన పాటిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలో ఉన్న స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యుర్థులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేసి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారిలో అత్మవిశ్వాసం నింపారు. ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం డీఈఓ కిష్టప్ప పరీక్షా సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
ఎరువులు వేసి అస్వస్థతకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
బొమ్మనహాళ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కమ్మరి సురేష్ (34) ఆదివారం మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆదివారం సెలవు కావడంతో సురేష్ ఉదయం పొలంలో పత్తి పంటకు రసాయన ఎరువులు వేయడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు తండ్రి తిప్పేస్వామితో కలిసి ఎరువు వేశారు. తండ్రి మధ్యాహ్న ఇంటికి రాగా, సురేష్ పొలంలోనే మిగతా ఎరువు వేసి వస్తాను అని చెప్పి పొలంలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం ఎండలో పనిచేసి ఓ చెట్టు కింద పడుకున్నాడు. చుట్టూ పక్కన పొలానికి చెందిన రైతులు సురేష్ను పలకరించిన ఎలాంటి స్పందన లేకపోడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సురేష్కు భార్య పవిత్రతో పాటు ముగ్గురు కుమారైలు ఉన్నారు. తిప్పేస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బొమ్మనహాళ్ పోలీసులు తెలిపారు.
లారీ కింద పడి
చత్తీస్ఘడ్ వాసి మృతి
కుందుర్పి: చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన సంతురామ్ (34) కుందుర్పి మండలం కదరంపల్లిలో ఆదివారం ప్రమాదవశాత్తూ బోరులారీ కింద పడి మృతి చెందాడు. కుందుర్పి పోలీసుల వివరాల మేరకు.. సంతురామ్ చత్తీస్ఘఢ్లోని దంతేవాడ జిల్లాకు చెందినవాడని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం బోర్వెల్ పనుల నిమిత్తం ఓ లారీ యజమాని కింద పనులు చేస్తూ కుందుర్పి మండలానికి వచ్చాడన్నారు. కదరంపల్లిలో బోరుబావి తవ్వుతుండగా శ్రీశైలం అజాగ్రత్త కారణంగా లారీని మలుపుతిప్పే ప్రయత్నంలో భాగంగా మృతుడు సంతురామ్పై లారీ ఎక్కించుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఘటనపై కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


