పెనుకొండ: ఆధ్యాత్మికత విలువను ప్రపంచానికి చాటిన మహనీయుడు సాయికాళేశ్వర్ అని షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శిల్పా అనుపాటి పేర్కొన్నారు. సాయికాళేశ్వర్ 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శివసాయి మందిరంలో సాయికాళేశ్వర్ సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకున్న 85 మందికి శిల్ప కంటి అద్దాలను అందజేశారు. ట్రస్ట్ సభ్యులకు వస్త్రాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు శిల్పా మాట్లాడుతూ సాయికాళేశ్వర్ పెనుకొండలోనే కాక ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల చదువులకు, పాఠశాలలు, కళాశాల అభ్యున్నతికి, తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంతో సహకారం అందించారన్నారు. ఆయన బాటలో గ్లోబల్ ట్రస్ట్ తరఫున నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. నిరవధికంగా కంటి ఆపరేషన్లు ఇతర ఉచిత వైద్య సేవలు కొనసాగించడమే కాక ఉచితంగా వినికిడి పరికరాలు, కంటి అద్దాలు అందజేస్తున్నామని తెలిపారు. దేశ విదేశాల నుంచి వైద్యులు ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన స్వామి భక్తులు, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ సిబ్బంది మదన్కుమార్రెడ్డి, చిట్టిబాబు, హరి, బాబు, గ్లోబల్జెన్, ప్రగతి పాఠశాలల కరస్పాండెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


