చిలమత్తూరు: టిప్పర్ ఢీకొని యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటరమణమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వెంకటరమణమ్మ భర్త పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈమె పెద్ద కుమారుడు గజేంద్ర (19) హిందూపురం సప్తగిరి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పనినిమిత్తం ఆదివారం బైకుపై బయటకు వెళ్లిన గజేంద్ర స్థానిక 544ఈ జాతీయ రహదారిలో లేపాక్షి వైపు నుంచి చిలమత్తూరు వైపు బైకును తిప్పుకుంటుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. టిప్పర్ టైరు గజేంద్ర తలపై వెళ్లడంతో తల నుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుమారుడు కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండడం చూసి వెంకటరమణమ్మ గుండెలవిసేలా రోదించింది. కాగా, గతంలో ఇదే చోట ఫార్చునర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. క్వారీలు ఉండటంతో నిత్యం టిప్పర్లు ఈ మార్గంలో ఎక్కువగా వెళ్తుంటాయి. డ్రైవర్లు అతివేగంతో ఇష్టారాజ్యంగా నడుపుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు, పోలీసులు టిప్పర్ వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


