తిమ్మమాంబ ఆలయం.. సర్వాంగ సుందరం
ఎన్పీకుంట: మండల పరిధిలోని గూటిబైలు గ్రామం తిమ్మమ్మమర్రిమాను వద్ద శనివారం రాత్రి మహాశివరాత్రి జాగరణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శనివారం అమ్మవారి రథోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విద్యుత్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చారు. రథాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు లాగి ఉత్సవాలను ప్రారంభించారు. తిమ్మమ్మమర్రిమాను, దిగువగూటిబైలు, ఎగువగూటిబైలు గ్రామాల్లో బాణసంచా పేల్చుతూ, కోలాటాలు నిర్వహిస్తూ సందడి చేశారు. అమ్మవారికి భక్తులు పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
జాగరణ ఉత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు..
మర్రిమాను వద్ద మహాశివరాత్రి జాగరణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న సందర్భంగా తిమ్మమ్మమర్రిమాను వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, అన్నదాన కార్యక్రమం, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూరల్ సీఐ నాగేంద్ర, స్థానిక ఎస్ఐ క్రిష్ణమూర్తి పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణుమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు వెంకటనారాయణ, శ్రీనివాసులు, నారాయణ స్వామి, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో
సాంస్కృతిక కార్యక్రమాలు
తిమ్మమాంబ ఆలయం.. సర్వాంగ సుందరం
తిమ్మమాంబ ఆలయం.. సర్వాంగ సుందరం


