కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి
ఓడీచెరువు: కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలోని తిప్పేపల్లి తండాలో జరిగింది. తండాకు చెందిన రామానాయక్ తన ఇంటి వద్ద గొర్రెల మంద ఏర్పాటు చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున గొర్రెల మందపై కుక్కల గుంపు దాడికి తెగబడింది. శునకాల దాడిలో 18 గొర్రెలు, 12 పిల్లలు మృత్యువాత పడ్డాయి. 10 గొర్రెలు గాయపడినట్లు బాధితుడు తెలిపాడు. రూ. 3 లక్షల వరకూ నష్టం జరిగిందని వాపోయాడు. గాయపడ్డ గొర్రెలకు మండల పశువైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ చికిత్స అందించారు.
చిరుత దాడిలో 6 గొర్రెలు..
అగళి: మండల పరిధిలోని నరసబుంది గ్రామ సమీపంలోని వడ్నమ్మ దేవాలయం వద్ద శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. మొత్తం 6 గొర్రెలు మృతి చెందినట్లు బాధిత రైతు బాలయ్య తెలిపాడు. సమాచారం అందుకున్న అటవీ శాఖ బీట్ ఆఫీసర్ సంజీవరాయుడు ఘటనా స్థలానికి చేరుకొని గొర్రెల కళేబరాలను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా నరసబుంది గ్రామ పరిసర ప్రాంతంలో చిరుత తిరుగుతోందని గ్రామ ప్రజలు తెలిపారు.
మూలపల్లిలో చోరీ
తలుపుల: మండలంలోని మూలపల్లిలో చోరీ జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పద్మజ ఇంటిలో గురువారం రాత్రి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెన్నయ్య తెలిపారు.
జేఎన్టీయూ ప్రొఫెసర్కు ఐఎంఎస్ ఫెలో అవార్డు
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు ఐఎంఎస్ (ఇండియన్ మెంబరెన్ సొసైటీ) ఫెలో అవార్డు దక్కింది. ఐఐటీ ముంబైలో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో శనివారం అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఓఎస్డీటూ వీసీ ప్రొఫెసర్ ఎన్.దేవన్న, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి తదితరులు అభినందించారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
గుత్తి: పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో రైల్వే బ్రిడ్జి సమీపంలో శనివారం రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 50 సంవత్సరాలు ఉండవచ్చు. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి
కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి


