పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లకూడదు: జేసీ
చిలమత్తూరు: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పంపిణీ చేయనున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాల్లో కొలతలు, హద్దులు తదితర వివరాలన్నీ పక్కాగా ఉండాలని, ఎక్కడా తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని దేమకేతేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మార్చి నెలలో నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన పట్టాదారు డ్రాఫ్ట్ పుస్తకాలను జేసీ పరిశీలించారు. ఈ–కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతుల వేలిముద్రలు, భూమి విస్తీర్ణం తదితర వివరాలు, వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం కొడికొండలో పర్యటించి అక్కడ జరుగుతున్న రీసర్వేను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోజ్కుమార్, డీటీ జగన్నాథ్, సర్వేయర్లు కోదండపాణి , రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘విద్యాంజలి’తో
బడులు బలోపేతం
పుట్టపర్తి అర్బన్: ‘విద్యాంజలి–2.0’ కార్యక్రమం ద్వారా దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల అందించే చేయూతతో సర్కారు బడులు బలోపేతం అవుతాయని డీఈఓ కిష్టప్ప తెలిపారు. బుధవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఓ ట్రస్ట్లో ‘విద్యాంజలి 2.0’ అమలుపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు, ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యాంజలి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని పాఠశాలలకు సహాయం చేసేలా పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలతో కార్యకమ్రాలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాలల పోర్టల్లో తమ పాఠశాల పేరు రిజిష్టర్ చేయాలని, అక్కడే తమ పాఠశాలల అవసరాలను అందులో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పెనుకొండ డివిజన్ ఉప విద్యాధికారి జాన్రెడ్డెప్ప, సెక్టోరియల్ అధికారులు చంద్రశేఖర్, హరి ప్రసాద్, పుల్లన్న, రెహమాన్, ఫణి శర్మ, మాధవరెడ్డి, కోఆర్డినేటర్లు డాక్టర్ పుల్లన్న, జయచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనుల
పురోగతికి చర్యలు
● ఉపాధి హామీ పథకం డైరెక్టర్
షన్ముఖ్కుమార్
ప్రశాంతి నిలయం: ఉపాధి హామీ పథకంలో పనుల పురోగతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పథకం రాష్ట్ర డైరెక్టర్ షన్ముఖ్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఉపాధి పనుల స్థితిగతులపై పీడీ విజయ్ప్రసాద్తో కలిసి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సిబ్బందితో సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో 59,270 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు అధికారులు డైరెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకూ భౌతికంగా 23,288 పనులు పూర్తయినట్లు వెల్లడించారు. ఉద్యాన తోటల్లో 15,378, హౌసింగ్ పరిధిలో 1,777 పనులకు మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. వీటితో కలిపి సుమారు 40,443 పనులు పూర్తయినట్లు చెప్పారు. ఇంకా 18,827 పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా జీరో ఎక్స్పెండేచర్ పనులు 500, డీసీసీ పనులు 5,735 మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. 20 పనుల కంటే తక్కువ చేసిన పంచాయతీలు జిల్లాలో 102 ఉన్నట్లు వివరించారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లకూడదు: జేసీ
పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లకూడదు: జేసీ


