పౌర సేవల్లో జాప్యం ఉండకూడదు
ప్రశాంతి నిలయం: మీ– సేవ కేంద్రాల ద్వారా అందించే పౌరసేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మీ–సేవ కేంద్రాల ఆపరేటర్లకు సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి ఆపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మ్యుటేషన్, కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర ముఖ్యమైన రెవెన్యూ సేవలను నిర్దిష్ట గడువులోపు ప్రజలకు అందించాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అలాగే ఎవరూ కూడా అదనపు రుసుము వసూలు చేయకూడదన్నారు. ప్రతి దరఖాస్తునూ రెవెన్యూ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు. మీ–సేవా కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు మహేష్, శర్మ, ఆనంద తితరులు పాల్గొన్నారు.
బ్లడ్ బ్యాంక్ను అందుబాటులోకి తేవాలి
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న బ్లడ్ బ్యాంకులో సౌకర్యాలన్నీ కల్పించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాలులో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పరిధిలోని పీహెచ్సీ వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి సమావేశానికీ డీఆర్ఎంజీఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ తప్పక హాజరు కావాలన్నారు. రక్తం లేకుండా రోగులు ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించాలని, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం విస్తృతం చేయాలన్నారు. ఈ వారాన్ని టీకా వారంగా డ్రైవ్ చేపట్టి వంద శాతం టార్గెట్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్యాధికారి శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
మీ–సేవా ద్వారా సర్వీసులు
సకాలంలో అందించాలి
మీ–సేవ ఆపరేటర్లకు
కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం
పౌర సేవల్లో జాప్యం ఉండకూడదు


