ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో బుధవారం నిర్వహించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక సజావుగా జరిగింది. ఎంపీపీగా హులికుంట ఎంపీటీసీ సభ్యురాలు ఎస్ఆర్ సుమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఎంపీపీ–1గా గుడ్డగురికి ఎంపీటీసీ సభ్యుడు లింగరాజు, వైస్ ఎంపీపీ–2గా రొళ్ల ఎంపీటీసీ సభ్యురాలు సౌమ్య కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారులు వారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీలుండగా బుధవారం జరిగిన ఎంపీపీ ఎన్నికకు దొడ్డేరి ఎంపీటీసీ సభ్యురాలు హెచ్డీ కవిత, రొళ్ల–2 ఎంపీటీసీ సభ్యుడు డీఎల్ నాగరాజు, మల్లినమడుగు ఎంపీటీసీ సభ్యురాలు రత్నమ్మ ముగ్గురు గైర్హాజరయ్యారు. మిగిలిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీ ఎన్నికలో పాల్గొన్నారు. ఎన్నిక ప్రక్రియకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రామకృష్ణయ్య వ్యవహరించారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎంపీపీ ఎన్నికను తహసీల్దార్ షేక్షావలి, ఎంపీడీఓ నాగేశ్వరశాస్త్రి, మండల పరిషత్ ఏఓ ప్రసాద్, కార్యదర్శి శ్రీనాథ్, మండల పరిషత్ సిబ్బంది పర్యవేక్షించారు.


