టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి టౌన్: ఉపాధ్యాయుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని వైఎస్సార్టీఏ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో డీఈఓ కిష్టప్పకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీహెచ్ఓను పాఠశాల మొత్తానికి ఇవ్వాలని, ఎస్ఎస్సీ డ్యూటీ నుంచి దివ్యాంగులు, 55 సంవత్సరాలు పైబడినవారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులకు సీఎల్ వినియోగించుకొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నాడు–నేడు రెండో విడత, ఎస్ఎస్సీ వంద రోజుల ప్రణాళికలో సెలవు దినాల్లో పనిచేసిన వారికి సీసీఎన్ మంజూరు చేయాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రతాప్రెడ్డి, రామ్మోహన్, మహమ్మద్, అలీ, తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇంట్లో చోరీ
ఎన్పీకుంట: మండల పరిధిలోని ఆసంవారిపల్లికి చెందిన సిద్ధా హరీష్నాయుడు ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని శివాలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో హరీష్నాయుడు పాల్గొన్నాడు. భార్య కూడా వెంట రావడంతో ఇంటికి తాళం వేసుకొని వెళ్లాడు. ఆలయంలో పూజల అనంతరం తిరిగి ఇంటికి రాగా తలుపులు తెరచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 31 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ కిషోర్రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని సోమవారం క్లూస్ టీం పరిశీలించి, వేలి ముద్రలు సేకరించింది.
యువకుడి మృతదేహం లభ్యం
పెనుకొండ (సోమందేపల్లి): సోమందేపల్లి మండలం నక్కల గుట్ట వద్ద హంద్రీ–నీవా లిఫ్టు పంపు హౌస్లో గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ పట్టణంలోని నారాయణమ్మ కాలనీకి చెందిన మహేష్కుమార్ (26) బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం హంద్రీ–నీవా లిఫ్టు పంపు హౌస్ వద్దకు ఈత కోసం వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. అక్కడున్న కొందరు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి కావడంతో ప్రయత్నాలు విరమించుకున్న పోలీసులు సోమవారం పెనుకొండ అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం యువకుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుని సోదరుడు శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రెచ్చిపోయిన దొంగలు
● 11 మంది రైతుల పొలాల్లో కేబుల్ వైరు చోరీ
అగళి: దొంగలు రెచ్చిపోయారు. 11 మంది రైతుల పొలాల్లో కేబుల్ వైరు చోరీ చేశారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని మధూడి గ్రామంలో సర్పంచ్ శివకుమార్, దేవరాజు, రంగనాథప్ప, గిరీష్, సత్యనారాయణ, రవిశంకర్, గోవిందప్ప, తదితర 11 మంది రైతుల పొలాల్లో దాదాపు 480 మీటర్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి


