చదువుకుంటేనే ఉజ్వల భవిత
చిలమత్తూరు: ‘‘డబ్బు ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు. కానీ చదువు అలా కాదు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. అందువల్ల అందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’’ అని రాష్ట్ర లేబర్ కమిషనర్, జిల్లా అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేకాధికారి గంధం చంద్రుడు, కలెక్టర్ శ్యాం ప్రసాద్లు టేకులోడు ఎంజేపీ విద్యార్థినులకు సూచించారు. శనివారం వీరు టేకులోడు క్రాస్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... క్రమశిక్షణతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందన్నారు. బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. 10 వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని, ఆ దిశగా విద్యార్థులను చదివించాలని సూచించారు.
సౌకర్యాలు కల్పించండి..
గురుకుల పాఠశాల పక్కనే ఉన్న జగనన్న కాలనీలో సౌకర్యాలు లేక రెండేళ్లుగా కష్టాలు పడుతున్నామని కాలనీ వాసులు కలెక్టర్ ఎదుట వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోతోందన్నారు. అలాగే తాగునీరు, వీధి లైట్లు కూడా లేవన్నారు. దీంతో కలెక్టర్ శ్యాం ప్రసాద్, గంధం చంద్రుడుతో కలిసి కాలనీలో పర్యటించారు. సమస్యలు వెంటనే పరిష్కారించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ మనోజ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథ్, ఎంఈఓ హనుమంతరెడ్డి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇష్టపడి చదివి
ఉన్నత శిఖరాలకు చేరాలి
టేకులోడు ఎంజేపీ విద్యార్థినులతో
గంధం చంద్రుడు, శ్యాం ప్రసాద్


