పరిష్కార వేదిక రద్దు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని (పీజీఆర్ఎస్) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రద్దు చేసిట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
తేమ శాతం 12 లోపు
ఉంటేనే కందుల కొనుగోలు
● జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య
బత్తలపల్లి: రైతులు తీసుకువచ్చే కందులలో తేమ శాతం 12 లోపు ఉంటేనే కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య సూచించారు. శనివారం మండల కేంద్రమైన బత్తలపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావడానికి రెండు, మూడు రోజుల ముందే సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. కందులలో తేమ శాతం 12 శాతం లోపల ఉండాలని సూచించారు. కందుల కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రబీ ఈ–పంట నమోదు, కందుల కొనుగోలు రిజిస్ట్రేషన్ త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఓబిరెడ్డి, విస్తరణ అధికారి శ్రీనివాసులు, ఏజెన్సీ నిర్వహకులు, రైతులు పాల్గొన్నారు.
వేదం.. ప్రపంచానికి ఆదర్శమార్గం
● ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణమూర్తి
ప్రశాంతినిలయం: భారత గడ్డపై పుట్టిన వేదమంత్రం నేటి ఆధునిక ప్రపంచానికి ఆదర్శమార్గమైందని కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ, విజ్ఞాన వ్యవస్థ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో శనివారం రెండో రోజు కూడా రెండో గ్లోబల్ వేదిక్ సదస్సు ఘనంగా సాగింది. ఉదయం సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత వేద పఠనంతో సదస్సు ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు వేదం యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ వేద విద్య వ్యాప్తికి సత్యసాయి బాబా ఎంతో కృషి చేశారన్నారు. నిత్య జీవితంలో మానసిక పరిపక్వతకు, ఆధ్యాత్మిక మార్గం వైపు మనిషిని నడిపే ఒక దివ్య శక్తి వేదమన్నారు. నేడు ప్రపంచ దేశాలు కూడా భారతీయ వేదాలను అనుసరిస్తున్నాయన్నారు. అనంతరం బాలవికాస్ పూర్వ విద్యార్థులు ‘నటరాజ తాండవం’ పేరుతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించారు.
పరిష్కార వేదిక రద్దు


