
ఆశగా రప్పించి.. నిరాశతో తిప్పి పంపించి
పుట్టపర్తి: గుంటూరులో శుక్రవారం జరగాల్సిన డీఎస్సీ–25 కొత్త టీచర్ల నియామకపత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడింది. ముందెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రచార యావ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని 750 మంది అభ్యర్థుల కోసం 45 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఒక అభ్యర్థికి తోడుగా మరో కుటుంబ సభ్యుడు కచ్చితంగా రావాల్సిందేనంటూ చెప్పారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులు తమకు వీలుకాదని, అనారోగ్యంగా ఉన్నామని వేడుకున్నా కనికరించలేదు. ఉద్యోగం కావాలంటే తప్పదని స్పష్టం చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. ఇక్కడికి చేరుకోవడానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. అనారోగ్యంగా ఉన్నవారు సైతం రాత్రికి రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. మరికొందరు ఉదయాన్నే వచ్చారు. అక్కడ 45 బస్సులు సిద్ధం చేశారు. ప్రతి బస్సుకు నలుగురు లైజన్ ఆఫీసర్లను నియమించారు. అల్పాహారం సిద్ధం చేశారు. తిని బస్సుల్లో ఎక్కి కూర్చున్నారు. ఈ సమయంలో వర్షాల కారణంగా కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు డైరెక్టరేట్ నుంచి డీఈఓకు సమాచారం అందడంతో ఆ మేరకు డీఈఓ ప్రసాద్బాబు అధికారికంగా ప్రకటించారు. ముందుచూపు లేకుండా ఇలాంటి కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారని పలువురు అభ్యర్థులు మండిపడ్డారు. వాతావరణ శాఖ నుంచి కనీస సమాచారం తీసుకోకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త టీచర్లకు నియామక పత్రాల
అందజేత వాయిదా
బస్సుల్లో కూర్చున్న తర్వాత
ప్రకటించిన వైనం