రైతులు వీధుల్లో.. మంత్రులు సీఎం సభ ఏర్పాట్లలో.. | - | Sakshi
Sakshi News home page

రైతులు వీధుల్లో.. మంత్రులు సీఎం సభ ఏర్పాట్లలో..

Sep 9 2025 1:14 PM | Updated on Sep 9 2025 1:14 PM

రైతులు వీధుల్లో.. మంత్రులు సీఎం సభ ఏర్పాట్లలో..

రైతులు వీధుల్లో.. మంత్రులు సీఎం సభ ఏర్పాట్లలో..

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక్క బస్తా యూరియా దొరికినా చాలు అంటూ తెల్లార్లూ జాగారం చేస్తున్న పరిస్థితి. ఏ ఊరికెళ్లినా యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రైతన్నల ఇబ్బందులపై సామాజిక మాధ్యమాల్లోనూ శరపరంపరగా పోస్టులు కన్పిస్తున్నాయి. సర్కారు తీరుపై సామాన్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా దగ్గరుండి రైతుల కష్టాలు తీర్చాల్సిన మంత్రులు అసలు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. ‘మీరు ఏం చావు చస్తే మాకేమిటీ’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు రైతులు అర్ధరాత్రి నుంచే యూరియా కోసం పంపిణీ కేంద్రాలు, ఎరువుల దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం సభ ఏర్పాట్లలో ఉండగా.. అధికారులు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు.

సగం కేబినెట్‌ అనంతపురంలోనే..

రాష్ట్రంలో ఒక జిల్లాలోనో, ఒక నియోజకవర్గంలోనో కాదు ఊరూరా యూరియా కష్టాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లే ముఖ్యమయ్యాయని సామాన్యులు వాపోతున్నారు. ఈ నెల 10వ తేదీన ‘సూపర్‌ సిక్స్‌–సూపర్‌హిట్‌’ అనే కార్యక్రమాన్ని అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం 10 మంది మంత్రులు వారం రోజులుగా ఇక్కడే ఉన్నారు. సీఎంతో పాటు పవన్‌కల్యాణ్‌, లోకేష్‌ సభకు వస్తున్నారని, అట్టహాసంగా చేయాలన్న ఆలోచనతో మంత్రులు ఈ ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, సవిత, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, నారాయణ తదితరులంతా ఇక్కడే ఉన్నారు. ఇక రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా రైతుల సమస్యలు గాలికొదిలి సీఎం సభ ఏర్పాట్ల నిమిత్తం అనంతపురంలో మకాం వేశారు.

నియోజకవర్గాల్లో ఒక్కరూ లేరు..

మంత్రుల మాట దేవుడెరుగు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలంతా సీఎం సభ ఏర్పాట్లలోనే తరిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో వరి ఎక్కువగా పండిస్తారు. గడిచిన పక్షం రోజులుగా ఇక్కడ యూరియా లేదు. కానీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనంతపురం వదలి అక్కడికి వెళ్లడం లేదు. మడకశిర నియోజకవర్గంలో రెండ్రోజుల క్రితం తాగునీరు లేక ప్రజలు రోడ్డెక్కారు. కానీ ఆ ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మాత్రం అనంతపురంలోనే ఉన్నారు. ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, రాప్తాడు..ఇలా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ సీఎం సభ కోసమే పనిచేస్తున్నారు. సభ సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం కోసం ఒకర్ని మించి ఒకరు పోటీపడుతున్నారు. వీరు తీరును రైతులు, ప్రజలు ఏవగించుకుంటున్నారు.

యూరియా కోసం రైతుల పడిగాపులు

ఒక్క బస్తా కోసం రాత్రంతా జాగరణ

సగం కేబినెట్‌ వారం రోజులుగా

అనంతపురంలోనే మకాం

చంద్రబాబు సభ ఏర్పాట్ల కోసం

ముమ్మరంగా కృషి

మా బాధలు మీకు పట్టవా అంటూ

మంత్రులపై రైతుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement