
ప్రతీకారంతోనే రౌడీషీటర్ హత్య
పుట్టపర్తి టౌన్: ధర్మవరం నడిబొడ్డున జరిగిన రౌడీషీటర్ లోకేంద్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండ్రిని హత్య చేశాడన్న ప్రతీకారంతోనే బాలకృష్ణారెడ్డి తన సహచరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రత్న శనివారం పుట్టపర్తిలోని పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. మూడేళ్ల క్రితం ధర్మవరానికి చెందిన బాలకృష్ణారెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి బాడుగ విషయంలో రూ.10 తక్కువ ఇచ్చినందుకు అప్పట్లో ఆటోడ్రైవర్గా ఉన్న లోకేంద్ర దారుణంగా హత్య చేశాడు. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న బాలకృష్ణారెడ్డి అదును కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ధర్మవరం పట్టణంలోని శ్రీనిధి మార్ట్ ముందు స్నేహితుడితో కలిసి బైక్లో కూర్చుని ఉండగా.. బాలకృష్ణారెడ్డి తన సహచరులు సయ్యద్ ఇలియాజ్, ఆంజనేయులుతో కలిసి కారులో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కిందపడిన లోకేంద్రపై బాలకృష్ణారెడ్డి, ఆంజనేయులు కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపి.. కారులో పరారయ్యారు. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. డీఎస్పీ హమంత్కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా బాలకృష్ణారెడ్డి, సయ్యద్ ఇలియాజ్, ఆంజనేయులును నిందితులుగా గుర్తించి.. శనివారం కొత్తపేట సమీపంలో అరెస్ట్ చేశారు. వారినుంచి రెండు వేటకొడవళ్లు, కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ధర్మవరం టూటౌన్ రెడ్డెప్పతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అనుమానాస్పద మృతి
హిందూపురం: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని ట్రాక్ వద్ద రహంతుల్లా (45) అనే పానీపూరి వ్యాపారి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భార్య సహారాబాను ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
24 గంటల్లోపు కేసు ఛేదింపు
ముగ్గురు నిందితుల అరెస్ట్