
జోరుగా ఆశల ‘పరవళ్లు’
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓ.ఆర్.కే రెడ్డి, డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్, హెచ్చెల్సీ ఈఈ చంద్రశేఖర్ డ్యాం వద్ద స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు బోర్డు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వాయనం వదిలారు. ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీ ఓ.ఆర్.కే రెడ్డి, డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ మాట్లాడుతూ తుంగభద్ర ఎగువ కాలువకు తొలుత 100 క్యూసెక్కుల నీరు వదిలి తరువాత ప్రతి రెండు గంటలోకసారి నీటి విడుదలను పెంచుతామని తెలిపారు. కాలువకు 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రా, కర్ణాటక కోటా కలిపి నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఖరీఫ్లో పంటల సాగుకు ఈ నెల 10 నుంచి నవంబర్ 30 వరకూ దాదాపు 1,300 క్యూసెక్కులు వదులుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం నుంచి నదికి నీటిని విడుదల చేశామన్నారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ఇటీవల 80 టీఎంసీలకు కుదించామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్కు తుంగభద్ర జలాలు చేరుతాయని అధికారులు తెలిపారు.
నిలకడగా ఇన్ఫ్లో..
గురువారం కూడా తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో నిలకడగా కొనసాగింది. ఈ క్రమంలో 11 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 31,130 క్యూసెక్కులు నదికి, మరో 8,979 క్యూసెక్కులను హెచ్చెల్సీ, ఎల్లేల్సీ తదితర కాలువలకు వదులుతున్నారు. మొత్తంగా డ్యాంలో ఇన్ఫ్లో 45,944 కూసెక్కులు, ఔట్ఫ్లో 40,109 క్యూసెక్కులుగా నమోదైంది.
విషయాలు తెలియవంట..
గతంలో హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తుంటే స్థానిక అధికారుల్లో హడావుడి ఉండేది. ఎక్కడైనా కాలువలు దెబ్బతిన్నాయా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలా.. అని పరిశీలించడంతో పాటు నీటి వినియోగంపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈసారి మాత్రం బోర్డు అధికారులే వెంటపడుతుంటే నీటిని తీసుకోవడానికి హెచ్చెల్సీ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్చార్జ్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి విషయమే పట్టనట్లు ఉన్నారు. తాజాగా గురువారం నీటి విడుదలపై ఆయనను వివరణ కోరగా... హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసినట్లు ఉన్నారని, మిగితా విషయాలు తనకు తెలియవని, బోర్డు అధికారులతో మాట్లాడి కనుక్కో అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హెచ్చెల్సీ అధికారులు నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హెచ్చెల్సీకి నీటి విడుదల
రెండు రోజుల్లో సరిహద్దుకు
చేరనున్న జలాలు