రాష్ట్రంలో దగాకోరు పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దగాకోరు పాలన

May 31 2025 2:03 AM | Updated on May 31 2025 2:03 AM

రాష్ట్రంలో దగాకోరు పాలన

రాష్ట్రంలో దగాకోరు పాలన

అనంతపురం ఎడ్యుకేషన్‌: మహానాడులో చంద్రబాబు ప్రసంగం పరిశీలిస్తే అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే బాధ స్పష్టంగా కనిపిస్తోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఏడాది పాలనలో అన్ని విధాలుగా దగాపడ్డామనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారన్నారు. టీడీసీ, జనసేనతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే భావనలో ఉన్నారన్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు సైతం స్పష్టత వచ్చిందని, అందుకే రానున్న రోజుల్లో అధికారం కోల్పోవాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు.

చెప్పుకునేందుకు వంద ఉన్నాయి..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ నెరవేర్చారన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధిని సైతం పరుగులు పెట్టించారన్నారు. జగన్‌ పాలనలో ప్రజలకు చేకూరిన లబ్ధిపై చెప్పుకునేందుకు వంద ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలో చెప్పుకునేందుకు ఏ ఒక్కటీ లేదన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమల ఊసే లేదు కానీ, అన్నీ అమలు చేశానని చంద్రబాబు గొప్పలకు పోతున్నారని, ఆయనకు అల్జీమర్స్‌ పీక్స్‌కు వెళ్లిందనేందుకు ఇదే నిదర్శమన్నారు. ఈ పరిస్థితులను చూస్తూంటే ఆయన కుర్చీని లోకేష్‌బాబు లాక్కొనే టైం వచ్చిందనే అనుమానం కలుగుతోందన్నారు.

వ్యవస్థలన్నీ నాశనం..

చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలల అమ్మకాలు, వెనుకబడిన ప్రాంతాల తాగు, సాగునీటి ప్రాజెక్టులు.. వలంటీర్ల వ్యవస్థ, ఉన్న ఉద్యోగాల రద్దు, సచివాయాలు, ఆర్బీకేలు, మహిళా సాధికారత, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేశారన్నారు. నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. పథకాల కోసం గొంతెత్తితే గొంతుకోస్తారనే భయాన్ని సృష్టించారన్నారు. రాష్ట్రానికి తనకు తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకునే చంద్రబాబు వాస్తవానికి కరువుకు, అపద్ధాలకు, దగాకోరు పాలనకు, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అనే విషయాన్ని విస్మరించారన్నారు. అభివృద్ధి పేరుతో ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించి, వాటిని పక్కదారి పట్టించడంపై ఉన్న తపన నీళ్లు పారించే విషయంగా చంద్రబాబుకు లేదన్నారు. అందుకే రాయలసీమకు కాని, గ్రేటర్‌ రాయలసీమకు గాని తాగు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. గండికోట నుంచి గాలేరు–నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డి పథకం తీసుకొచ్చి సగానికి పైగా పనులు చేస్తే చివరకు ఆ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రద్దు చేశారన్నారు. హంద్రీనీవా మొదటిదశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీల నీటిని అదనంగా తీసుకొచ్చే పనులను ప్రారంభిస్తే ఆ ప్రాజెక్ట్‌నూ రద్దు చేశారన్నారు. నారా వారి పాలనపై రాయలసీమ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, నాయకులు పొగాకు రామచంద్ర, కదిరి ఇస్మాయిల్‌, రాప్తాడు వైస్‌ ఎంపీపీ రామాంజి, గంగుల సుధీర్‌రెడ్డి, బండిపవన్‌, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement