
అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్, స్ప్రింక్లర్లు అందిస్తామని
● పైసా విదల్చని కూటమి ప్రభుత్వం
● సుఖీభవ లేదు, ఇన్పుట్, ఇన్సూరెన్స్కు గతి లేదు, ఎక్స్గ్రేషియా అసలే లేదు
● పంటలు దెబ్బతిన్నా ఖరీఫ్, రబీలో కంటితుడుపుగా కరువు మండలాల ప్రకటన
● ఆర్బీకేలు, అగ్రి–వెటర్నరీ ల్యాబ్లు నిర్వీర్యం, ఆగిన 1962 అంబులెన్స్ సేవలు
అన్నదాత సుఖీభవ కింద ఏటా ప్రతి రైతుకూ రూ.20 వేలు పెట్టుబడిసాయం అందిస్తామన్న హామీని కూటమి పెద్దలు తుంగలో తొక్కేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లోకి వేసింది. చంద్రబాబు చెప్పినట్లు సుఖీభవ పథకం కింద ఈ ఏడాది రూ.20 వేలు ఇచ్చివుంటే 2.90 లక్షల మంది వరకు రైతులకు రూ.580 కోట్లు జమ అయ్యేవి. పోనీ, పీఎం కిసాన్ రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14 వేలు ఇచ్చివున్నా రూ.400 కోట్ల పైచిలుకు ప్రయోజనం చేకూరేది. అయితే పైసా ఇవ్వకుండా ఈ ఏడాది మొండి చెయ్యి చూపించారు.
● గతంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏటా పీఎం కిసాన్, రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.67,500 చెల్లించింది. అలా ఐదేళ్లలో జిల్లా రైతులకు రూ.1,937 కోట్ల పెట్టుబడి సాయం అందింది.
2023 ఖరీఫ్, రబీకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం కింద ఇవ్వాల్సిన పరిహారంతో తమకు సంబంధం లేదన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 2024 ఖరీఫ్లో ఉచిత పంటల బీమా అమలు చేసినా... పరిహారం చెల్లింపు అనుమానంగానే కనిపిస్తోంది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి రబీ నుంచి రైతుల నుంచి ప్రీమియం కట్టించుకోవడం మొదలు పెట్టారు. ఇలా ఇకపై ఏటా రూ.100 కోట్ల వరకు ప్రీమియం రూపంలో రైతులపై అదనపు భారం మోపారు.
● 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా జిల్లా రైతులకు రూ.1,967 కోట్ల భారీ మొత్తంలో పరిహారం చెల్లించింది. తొలిసారిగా ఉద్యాన రైతులకు బీమా ఇచ్చి భరోసా కల్పించింది. ఇక ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆదా అయ్యేలా చర్యలు తీసుకుంది.
ఖరీఫ్, రబీ పంట ఉత్పత్తులు అరకొరగానే చేతికొచ్చాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది.
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.350 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను మద్ధతు ధరతో కొనుగోలు చేసింది.
ఖరీఫ్, రబీ కింద బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఖరీఫ్, రబీ కింద బ్యాంకుల్లో రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు సున్నావడ్డీ కింద రూ.72 కోట్ల వరకు వడ్డీ మాఫీ చేయడంతో 3.40 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
విత్తనంపై రాయితీ తగ్గింపు
కరువు పరిస్థితులు నెలకొన్నా ఈ రబీలో కేవలం 25 శాతం సబ్సిడీతో విత్తన పప్పుశనగ అందించడంతో జిల్లా రైతులపై రూ.6 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక ఖరీఫ్లో విత్తన వేరుశనగ, కందులు నామమాత్రంగా అందించారు. 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయం అంటూ 27 వేల క్వింటాళ్లకు గానూ 10 వేల క్వింటాళ్లతో సరిపెట్టారు.
● గత జగన్ సర్కార్ 40 శాతం రాయితీతో రైతులకు విత్తనం అందించింది. ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని రకాలకు చెందిన 6.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై రైతులకు రూ.289 కోట్ల రాయితీ దక్కింది.
దిక్కూమొక్కు లేని పంటల బీమా
మద్ధతు ధర హుష్కాకి
స్పష్టత లేని సున్నా వడ్డీ