
విద్యార్థిని తండ్రికి అప్పగిస్తున్న ఎస్ఐ రాజశేఖర్రెడ్డి
నార్పల: మండలంలోని కేసేపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి తప్పించుకుని పోయిన విద్యార్థి ఆచూకీని పోలీసులు పసిగట్టి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలను ఎస్ఐ రాజశేఖరరెడ్డి శుక్రవారం వెల్లడించారు. గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ కుమారుడు రేవంత్కుమార్ కేసేపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఉగాది పండగకు సెలవులు కావడంతో గత శనివారం ఉపాధ్యాయులకు తెలిపి స్వగ్రామానికని రేవంత్కుమార్ బయలుదేరాడు. సెలవులు ముగిసిన పాఠశాలకు రాకపోవడంతో బుధవారం ఉదయం యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తమ కుమారుడు ఇంటికే రాలేదంటూ తల్లిదండ్రులు తెలిపి, వెంటనే పాఠశాలకు చేరుకుని ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో కలసి అదే రోజు నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో యాడికిలోని అగాపే చర్చిలో ఉన్నట్లుగా తెలుసుకుని శుక్రవారం ఉదయం స్టేషన్కు పిలచుకువచ్చి తండ్రికి అప్పగించారు. విద్యార్థి పట్ల అశ్రద్ధ వహించిన పాఠశాల ఉపాధ్యాయులపై ఎస్ఐ రాజశేఖర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమంగా కల్లు విక్రయిస్తున్న టీడీపీ నేత అరెస్ట్
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని బోరంపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా కల్లు విక్రయిస్తున్న ఆ గ్రామ టీడీపీ నేత జయరాంను శుక్రవారం ఉదయం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అరెస్ట్ చేశారు. 70 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. అలాగే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది – బోరంపల్లి మార్గం మధ్యలో శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 480 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని సెబ్ పోలీసులు సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న ఒంటిమిద్ది నివాసి గంగాధర్ను అరెస్ట్ చేశారు. కాగా, గంగాదర్పై పదుల సంఖ్యలో ఇప్పటికే అక్రమ మద్యం కేసులు ఉండడం గమనార్హం. తనిఖీల్లో సెబ్ సీఐ వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.