● తొమ్మిది గ్రాముల బంగారం స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): రైల్లో చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రైల్వే పోలీస్స్టేషన్లో ఆదివారం స్థానిక, గూడూరు ఇన్చార్జి ఎస్సై ఎన్.హరిచందన నిందితుని వివరాలను వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న మోపూరు ప్రాంతానికి చెందిన పెంచల నరసింహను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ఏడాది మేలో గూడూరు సమీపంలో తిరుపతి వెళ్లే రైలులో చోరీ చేసినట్లు నిందితుడు వెల్లడించడంతో అరెస్ట్ చేసి తొమ్మిది గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రయాణికులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో ఆర్పీఎఫ్ ఎస్సై నారాయణ, ఆర్పీఎఫ్ ఏఎస్సై ప్రభాకర్, జీఆర్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


