2 వేల జనాభా.. 11 మద్యం దుకాణాలు!
సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇటీవల ఓ బెల్టు షాపులో మద్యం తాగి ఇసుక టిప్పర్ నడిపి ఏడుగురు దుర్మరణానికి కారణమయ్యారు. కొన్ని నెలల క్రితం ఆత్మకూరు మండలంలో 2 వేల మంది జనాభా ఉన్న బోయలచిరివెళ్లలో ఏకంగా 11 బెల్టు దుకాణాలు ఉన్నాయని, వాటిని తొలగించాంటూ ఆ ఊరు ప్రజలు ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఉదంతం జరిగింది. ఇక్కడ బెల్టు షాపుల నిర్వహణ ఎకై ్సజ్ శాఖ పనితీరును, ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తోంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎకై ్సజ్ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. కూటమి పార్టీలకు చెందిన నాయకులు మద్యం షాపులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామగ్రామాన బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. దీంతో ఆటోల డ్రైవర్లు, ఇతర వాహన చోదకులు ఇష్టానుసారం మద్యం సేవిస్తూ వాహనాలను నడుపుతుండడంతో ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 566 మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక్కడ ఎనీ టైమ్ మద్యం లభిస్తోంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్. ఉదయగిరి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని డీసీపల్లిలోని విజయ చాముండేశ్వరీ వైన్ షాపు నుంచి కొనుగోలు చేసింది. ఈ బాటిల్ ఎమ్మార్పీ రూ.210. కానీ ఓ మద్యం ప్రియుడు శుక్రవారం ఈ బాటిల్ కొనుగోలు చేయగా, అతని వద్ద నుంచి రూ.220 ఫోన్పే ద్వారా చేయించుకున్నారు. ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా తీసుకున్నారు.


