● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి
కోవూరు: వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని ఆ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నెల్లూరులోని తన నివాసంలో విడవలూరు మండల పార్టీ నూతన కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మండల స్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధత, బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత, తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. బూత్లెవల్ ఏజెంట్లు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి కొత్త కమిటీల సభ్యులు చురుకుగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్బాబు, సీనియర్ నాయకులు కొండూరు వెంకట సుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ మండలాధ్యక్షుడు చెర్లో సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


