ప్రభుత్వ నిబంధనల ప్రకారం టిప్పర్, లారీల్లో సుమారు 22 నుంచి 25 టన్నుల వరకు మాత్రమే సిలికాను రవాణా చేయాలి. అయితే గనుల శాఖ అధికారుల ఊదాసీనతతో నిబంధనలను తుంగలో తొక్కి సిండికేట్ సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సిలికా గనుల నుంచి బయటకు వచ్చే లారీ, టిప్పర్లు సుమారు 50 టన్నులకు మించి లోడ్ చేసుకుని వస్తున్నాయి. అధిక టన్నేజీ వాహనాలు గ్రామాల మీదుగా వెళ్తూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాగా రాయల్టీ వసూళ్ల టెండర్లను దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద టిప్పర్లు, లారీలు లోడింగ్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది పరిమితి మించి రవాణాకు సిండికేట్కు అండదండలు అందిస్తున్నారు.


