వరికుంటపాడు: మండలంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం ఎండ బాగా కాసింది. సాయంత్రం వేళ ఆకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తూ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల వడగళ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.


