నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతాయి. ఇవి వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 19,384 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 10,630 మంది బాలురు, 8,754 మంది బాలికలున్నారు. 13,291 మంది ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరవుతుండగా, 5,977 మంది ఫెయిలైనవారు, 116 మంది ఒకేషనల్ విద్యార్థులున్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9,046 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 5,245 మంది బాలురు, 3,801 మంది బాలికలున్నారు. 3,717 మంది ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరవుతుండగా, 5,066 మంది ఫెయిలైనవారు, 263 మంది ఒకేషనల్ విద్యార్థులున్నారు.
సీసీ కెమెరాల మధ్య..
పరీక్షల నిర్వహణ కోసం 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 66 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 660 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సిటింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలను 16 కస్టోడియన్ కేంద్రాల్లో భద్రపరిచి, రోజూ పోలీస్ పహారాలో ఆయా కేంద్రాలకు తరలించనున్నారు. తోటపల్లిగూడూరు, బిట్రగుంట, ఆత్మకూరు, ఉదయగిరి కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ పెట్టారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా విద్యార్థుల సౌకర్యం కోసం 0861 – 2320312 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆర్ఐఓ వరప్రసాదరావు తెలిపారు. నెల్లూరులోని కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. పరీక్షల్లో అవకతవకలకు పా ల్పడిన ఇన్విజిలేటర్లు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రాల్లో సీసీ కెమె రాలు తప్పనిసరిగా బిగించాలని ఆదేశించారు.
జిల్లాలో 66 కేంద్రాల్లో ఏర్పాట్లు
28 వేలమందికి పైగా
విద్యార్థుల హాజరు
కంట్రోల్ రూమ్ నంబర్
0861 – 2320312


