● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● రామన్నపాళెం సమీపంలోని
బంక్లో ఆకస్మిక తనిఖీ
కోవూరు : జిల్లాలో ఇంధన కొరత లేదని, ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కొడవలూరు మండలం రామన్నపాళెం రైల్వే గేటు సమీపంలోని ఓ పెట్రోల్ బంకును కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి స్టాక్ పొజిషన్, డిప్ రీడింగ్ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. బంకు నిర్వాహకులతో మాట్లాడారు. ఎక్కడా ఇబ్బంది రానియొద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన ఆయిల్ సరఫరా నిరంతరం కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా కడప, చిత్తూరు డిపోలతోపాటు కృష్ణపట్నం పోర్టు నుంచి క్రమం తప్పకుండా సరఫరా జరుగుతోందని చెప్పారు. జిల్లాకు మరికొన్ని గంటల్లోనే వివిధ ఆయిల్ కంపెనీలకు చెందిన ట్యాంకర్లు చేరుకుంటాయన్నారు. జిల్లాలో 243 పెట్రోల్ బంకుల్లోనూ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రతి బంక్ వద్ద పరిస్థితిని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపోహలను సృష్టించే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


