మహా ధర్నా విజయవంతానికి పిలుపు | - | Sakshi
Sakshi News home page

మహా ధర్నా విజయవంతానికి పిలుపు

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

నెల్లూరు రూరల్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌లో మే ఆరున నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కార్‌ కొలువుదీరి 22 నెలలు దాటినా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. దశలవారీ పోరాటంలో భాగంగా చేపట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి మాట్లాడారు. పీఆర్సీ కమిటీని గత ప్రభుత్వం ప్రకటించి ఐఆర్‌ను అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత సర్కార్‌ వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్‌ను ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రఘురామ్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర, ప్రసాద్‌రెడ్డి, ప్రసాద్‌, నెల్లూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివశంకర్‌రెడ్డి, మునీర్‌జాన్‌, ప్రకాశం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement