నెల్లూరు రూరల్: జిల్లాలో పెట్రోల్, డీజిల్కు ఎక్కడా కొరత లేదని.. అసత్య ప్రచారాలను నమ్మొద్దని జేసీ వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో డీఎస్ఓ లీలారాణితో కలిసి విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 243 పెట్రోల్ బంకుల్లో నిల్వలు సరిపడా ఉన్నాయని వెల్లడించారు. సరఫరా సక్రమంగా కొనసాగుతున్నా, కొరత ఉందనే వదంతుల నేపథ్యంలో కొన్ని చోట్ల రద్దీ కనిపిస్తోందని తెలిపారు. అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని కోరారు. క్యాన్లు, బాటిళ్లలో నింపడాన్ని నిషేధించామని పేర్కొన్నారు. వ్యవసాయం, ఆక్వా రంగాలకు తగినంత డీజిల్ను నిరంతరం సరఫరా చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని ప్రకటించారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లు, సీఎస్డీటీలను నియమించి.. నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. అప్పు ప్రాతిపదికన ఆయిల్ కంపెనీలు సరఫరా చేయని కారణంగా జిల్లాలోని 15 బంకుల్లో మాత్రమే చమురు తాత్కాలికంగా అందుబాటులో లేదని, మిగిలిన అన్ని చోట్ల పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. నో స్టాక్ బోర్డులు పెట్టినా.. కృత్రిమ కొరతను సృష్టించేందుకు యత్నించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇబ్బందులు ఏర్పడితే 94922 73897 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు.


