నెల్లూరు(బారకాసు): జనగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు 5కే రన్ జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గణన చేపడతారన్నారు. దేశ ప్రగతికి జనగణన కీలకమన్నారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. కచ్చితమైన జనాభా గణాంకాలు అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయన్నారు. 5కే రన్ వీఆర్సీ సెంటర్ నుంచి రామలింగాపురం, మినీబైపాస్, మాగుంట లేఅవుట్, కేవీఆర్ సర్కిల్, కొండాయపాళెం గేట్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగింది. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


