● మాజీ ఎమ్మెల్యే
మేకపాటి విక్రమ్రెడ్డి
ఆత్మకూరు : నియోజకవర్గంలోని అనేక పంట కాలువలు పూడికతీతకు నోచుకోక మరమ్మతులకు గురై సాగునీరు సజావుగా సాగే పరిస్థితి లేదని, ఈ విషయం తెలిసి కూడా పట్టించుకోకపోవడం ఏమిటని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి నిలదీశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో పంటకు సాగునీరు విడుదల చేసేందుకు ఐఏబీ సమావేశంలో 49 టీఎంసీల నీటిని 4.47 లక్షల ఎకరాలకు వినియోగించేలా నిర్ణయించారని, ఈ నేపథ్యంలో మరమ్మతులకు గురైన సాగునీటి కాలువలు మరమ్మతులకు గురైన విషయం అధికారులు తెలపకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతులకు నియోజకవర్గంలో 199 పనులకు ఎఫ్డీఆర్ నిధులను వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు అనంతరం ఆ పనులు ఎంత మేరకు జరిగాయో నేటికీ ప్రకటించలేదన్నారు. సుమారు రూ.10 కోట్లకుపైగా ప్రతిపాదనలతో ఎఫ్డీఆర్ పనులకు నిధులు కేటాయించారని, ఏ మండలంలో ఏ మేరకు పనులు జరిగాయో తెలపాలని డిమాండ్ చేశారు. అనంతసాగరం, ఏఎస్పేట, సంగం, మర్రిపాడు, చేజర్ల మండలాల్లో సుమారు 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే 165 చెరువులను అధికారులు పరిశీలించి కట్టలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.


