వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్యూ)లో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ అందజేసిన బస్సును వీసీ అల్లం శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సెయిల్ కంపెనీ తమ సీఎస్సార్ నిధులతో బస్సును వీఎస్యూకు అందజేయడం చాలా సంతోషకరమన్నారు. ఈ బస్సు ద్వారా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు సులువుగా చేరుకుని, అవగాహన సదస్సులు, అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించే అవకాశం కలుగుతుందన్నారు. సెయిల్ కంపెనీ సీఎస్సార్ హెడ్ డేవిడ్ ఆల్బర్ట్ పీటర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తమ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వీఎస్యూ లాంటి విద్యాసంస్థలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వీఎస్యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు.


