కోవూరు: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించి.. రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆరాతీశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. రోజుకు ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో ముచ్చటించారు. ప్రసూతి విభాగంలోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యమందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ సేవలు అత్యవసరమనే అంశాన్ని గుర్తించామని, త్వరలోనే భర్తీ చేయనున్నామని హామీ ఇచ్చారు. 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని డీసీహెచ్ఎస్ పరిమళను ఆదేశించారు. వైద్యులు సునీల్బాబు, సలావుద్దీన్, వంశీకృష్ణ, జ్యోతిప్రభ, సురేష్, పద్మావతి, సంధ్య, సరోజ తదితరులు పాల్గొన్నారు.


