నెల్లూరు(క్రైమ్): చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం పరిశీలించారు. వివిధ జిల్లాల నుంచి 177 మంది కానిస్టేబుళ్లు వచ్చి శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం తొలి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రిమినల్ లాస్ 1, క్రిమినల్ లాస్ 2, కంప్యూటర్ అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిని తనిఖీ చేసిన ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుళ్లకు పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతి, భద్రతా అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ గిరిధర్, సీఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు.
గండిపాళెం
హైస్కూల్లో చోరీ
ఉదయగిరి: మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు గదుల తాళాలు పగలగొట్టారు. గురువారం ఉదయం స్కూల్కు వచ్చిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ రెండు గదుల్లో బీరువాలతోపాటు నాలుగు సీలింగ్ ఫ్యాన్లు, సైన్స్ సామగ్రి, ఇతర వస్తువులు చోరీ చేశారని ప్రధానోపాధ్యాయుడు ఆర్.రవీంద్ర తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
పెన్నా తీరంలో మృతదేహం
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని సుభాన్ నగర్ సమీపంలో పెన్నానది తీరానికి గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టికొచ్చింది. పోలీసుల కథనం మేరకు.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సున వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఛాతిపై కుమారి అని పచ్చబొట్టు ఉంది. రూరల్ సీఐ వేణు కేసు నమోదు చేశారు.
రోడ్డు బాగు చేయాలంటూ ఆందోళన
సైదాపురం: మండలంలోని తుమ్మలతలుపూరు గ్రామ రోడ్డును బాగు చేయాలంటూ గ్రామస్తులు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుడూ గ్రామ రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. దీంతో కంకర రాళ్లు లేచి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.190
సన్నవి : రూ.130
పండ్లు : రూ.90


