● చలివేంద్ర గ్రామస్తుల అర్జీ అందజేత
నెల్లూరురూరల్: ‘మా ప్రాంతంలో ఇటీవల ఆయిల్ కంపెనీలు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలను పాటించకుండా వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేసి గ్రామాన్ని కలుషితం చేస్తున్నారు’ అని ముత్తుకూరు మండలం చలివేంద్ర గ్రామస్తులు తెలిపారు. సోమవారం నెల్లూరులో ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో కలెక్టర్కు హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుంగే ఇండియా కంపెనీ ఎడిబుల్ ఆయిల్ తయారు చేస్తోందన్నారు. అన్ని నిబంధనలు పాటిస్తామని తుంగలో తొక్కి ఇప్పుడు ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదా ఏపీఈఎంసీఎల్ ద్వారా తరలించాలన్నారు. కానీ ఇవేమీ పట్టించకుండా అనుమతి లేని వారి ద్వారా వ్యర్థాలు తరలిస్తున్నట్లు చెప్పారు. వారు తీసుకొచ్చి రోడ్ల పక్కన పడేస్తున్నారని చెప్పారు. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నట్లు వాపోయారు. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇంతకుముందు ఇదే కంపెనీకి రెండుసార్లు బోర్డు అధికారులు నోటీసులిచ్చి సరిపెట్టారన్నారు. ఇప్పటికై నా స్పందించి గ్రామాన్ని కాపాడాలని కోరారు.


