● పట్టలు కట్టే గోదాముపై
తీగలు పడి మంటలు
● రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని పంటపాళెం పంచాయతీ కోళ్లమిట్ట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బూడిద బల్కర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న పోర్టు రైల్వే వ్యాగన్లకు పట్టలు కట్టే గోదాముపై విద్యుత్ తీగలు పడి మంటలు వ్యాపించాయి. దీంతో పట్టలు తగులబడి సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం కారణంగా గోదాము పక్కనే ఆనుకుని ఉన్న పోర్టు టౌన్షిప్లో నివాసముంటున్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు అయ్యింది. తమిళనాడు ప్రాంతానికి చెందిన బల్కర్ డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేసినట్టుగా చెబుతున్నారు. బూడిదను తమిళనాడుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. తరచూ బల్కర్లు రోడ్డు ప్రమాదాలకు గురికావడంపై స్థానికులు మండిపడుతున్నారు.


