● ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
నెల్లూరు(పొగతోట): ప్రజల మనస్సుల్లో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొన్నారు. వేదాయపాళెంలోని ఓ కల్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా సదస్సును పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె మాట్లాడారు. జగనన్న పాలన స్వర్ణయుగమని తెలిపారు. సీఎం చంద్రబాబు రాక్షస పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మహిళల రక్షణ కోసం అనేక సంస్కరణలను తమ ప్రభుత్వ హయాంలో అమలు చేయగా, వీటిని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు సంక్షేమ కార్యక్రమాలను నాడు అమలు చేశారని, అయితే ప్రస్తుతం వీరికి రక్షణ కరువైందని మండిపడ్డారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు హామీలు, బాండ్లు ఇచ్చి ప్రజలు, రైతులు, ఉద్యోగులను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అయితే సూపర్ సిక్స్ను అమలు చేశామంటూ సీఎం గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. మాచర్లలో మహిళ ఇంట్లోకి దుండగుడు పట్టపగలు ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడినా, ఎలాంటి చర్యల్లేవని ఆరోపించారు.
పోరాటం చేయాలి
జగనన్న ఆలోచనల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా కమిటీలను ఏర్పాటు చేశామని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. టీడీపీ అరాచకాలతో బలైన కుటుంబాలకు బాసటగా నిలిచి న్యాయ పోరాటం చేయాలని కోరారు. ప్రశ్నిస్తున్న మహిళలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా, పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మహిళలు శక్తిగా పనిచేయాలని కోరారు.
కుతంత్రాలతో గెలిచారు
కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేసి కూటమి పార్టీలు గెలిచాయని కాకాణి పూజిత ఆరోపించారు. టీడీపీ పాలనలో మహిళల పరిస్థితి దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. జగనన్న అధికారంలోకి వచ్చాక, ప్రస్తుతం తప్పులు చేస్తున్న అధికారులు, నేతల తాటతీస్తారని తెలిపారు. సదస్సుకు హాజరైన వారిని చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వివరించారు. అనంతరం కల్యాణి, అరుణమ్మ, పూజితను గజమాలతో సత్కరించారు. పార్టీ నేతలు లక్ష్మీసునంద, కోడూరు కల్పలతారెడ్డి, మొయిళ్ల గౌరి, కటకం దీపిక తదితరులు పాల్గొన్నారు.
కల్యాణి, అరుణమ్మ, పూజితకు సత్కారం
మాట్లాడుతున్న వరుదు కల్యాణి
రెడ్బుక్ రాజ్యాంగ అమలుకే పరిమితం
రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకే ఖాకీలు పరిమితమవుతున్నారని కల్యాణి విమర్శించారు. కూటమి పాలనలో ప్రతి వీధిలో బెల్టుషాపులు వెలిశాయని ధ్వజమెత్తారు. సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలించేందుకు గానూ ప్రతి మహిళా ఆదిపరాశక్తి అవతారమెత్తాలని పిలుపునిచ్చారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. గ్రామ స్థాయి నుంచే పార్టీ మహిళా విభాగం బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.


