జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక

Apr 5 2026 7:36 AM | Updated on Apr 5 2026 7:36 AM

నెల్లూరు(లీగల్‌): జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నెల్లూరు బార్‌ అసోసియేషన్‌కు చెందిన సిరి విశ్వజ హింద్‌ ఎంపికయ్యారు. బీవీనగర్‌కు చెందిన బీఎస్సెన్నెల్‌ విశ్రాంత ఉద్యోగి నరేంద్రబాబు, హైమావతి కుమార్తె అయిన ఈమె విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ (హానర్స్‌) చదివారు. అనంతరం నెల్లూరు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కాగా ఈమెకు అభినందనలను పలువురు తెలియజేశారు.

కోర్టు భవనాల పరిశీలన

కోవూరు: పట్టణంలోని కోర్టు భవనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ శనివారం సందర్శించారు. ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సూచనలు చేశారు. సీనియర్‌ జడ్జి కోర్టు హాల్లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. తమ సమస్యలను తెలియజేయగా, వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పనితీరు, కేసుల విచారణ తదితర అంశాలపై బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సునీల్‌కుమార్‌, చంద్రమోహన్‌, ఏజీపీ సలీమ్‌, ఏపీపీ స్టాలిన్‌ వివరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి చైతన్య పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

15 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 68,445 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,383 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

కండలేరులో నీటి నిల్వ

రాపూరు: కండలేరు జలాశయంలో శనివారానికి 46.11 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 350, లో లెవల్‌కు 100, పిన్నేరుకు 20, మొదటి బ్రాంచ్‌ కాలువకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.

నిత్యాన్నదానానికి రూ.50 వేల విరాళం

రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఆత్మకూరుకు చెందిన గుండాల శేషారెడ్డి జ్ఞాపకార్థం భార్య పెంచలమ్మ, కుమార్తెలు నీరజ, పద్మజ, అల్లుళ్లు జనార్దన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి శనివారం అందజేశారని దేవస్థాన ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ప్రైవేట్‌ బస్సుల్లో తనిఖీలు

ఆత్మకూరు: ఆత్మకూరు మీదుగా దూర ప్రాంతాలకు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సులను మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు శనివారం ఉదయం తనిఖీ చేశారు. బస్సుల కండీషన్‌, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌, అగ్నిమాపక పరికరాలు, హ్యామర్స్‌ ఉన్నాయాననే అంశాన్ని పరిశీలించారు. బస్సులు కండీషన్‌లో లేకపోతే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement